Rahul gandhi: ముస్లింల హక్కులను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు.. రాహుల్ గాంధీ

by B.Srinivas |

కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

Rahul gandhi: ముస్లింల హక్కులను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు.. రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలను అణచివేసి వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘వక్ఫ్ బిల్లు ముస్లింను లక్ష్యంగా చేసుకుంది. భవిష్యత్తులో దీనిని ఇతర వర్గాలపై కూడా ఉపయోగించొచ్చు. ఈ బిల్లు రాజ్యాంగాన్ని, మత స్వేచ్ఛ హక్కు అయిన ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది భారతదేశ ఆలోచనలపై దాడి చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోంది: కేసీ వేణుగోపాల్

వక్ఫ్ బిల్లును ప్రమాదకరమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ (Venugopal) అభివర్ణించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా, రైతులు వీధుల్లోకి వచ్చారు. వారు ఎంఎస్పీ కోసం చట్టపరమైన హామీలను డిమాండ్ చేస్తున్నారు. కానీ దానిపై ప్రభుత్వం ఎటువంటి బిల్లు తీసుకరాలేదు. ఈ దేశంలోని యువకులు నిరుద్యోగులుగా మారారు. ఈ సమస్యను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ అత్యవసరంగా వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. విభజన ఎజెండా కోసమే దీనిని ముందుకు తెచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

బిల్లు కాపీని చించేసి అసదుద్ధీన్ నిరసన

వక్ఫ్ బిల్లును ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలను అవమానించడమే బిల్లు ఉద్దేశమని మండిపడ్డారు. ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటుందని, అంతేగాక మతపరమైన హక్కులను లాక్కోవాలని కోరుకుంటుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆర్టికల్ 25, 26లను ఉల్లంఘిస్తోందని ఫైర్ అయ్యారు. లోక్ సభలో చర్చ సందర్భంగా బిల్లు కాపీని చింపేసి నిరసన తెలిపారు.

Next Story