39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. రాహుల్‌గాంధీ సహా ప్రముఖుల స్థానాలివే

by Dishanational4 |
39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. రాహుల్‌గాంధీ సహా ప్రముఖుల స్థానాలివే
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 39 మంది అభ్యర్థుల పేర్లను హస్తం పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలోని వివరాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. రాహుల్‌ గాంధీ మరోసారి సిటింగ్‌ స్థానం కేరళలోని వయనాడ్‌ నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తొలి జాబితాలోని మొత్తం 39 మందిలో 15 మంది జనరల్‌, 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ వర్గాలకు చెందినవారని వేణుగోపాల్‌ తెలిపారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్ల లోపువారేనని చెప్పారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్‌ - సురేశ్‌ కుమార్‌ షేట్కర్‌, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.

30 లక్షల ఉద్యోగాల భర్తీ

కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఐదు హామీలను ప్రజలకు ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘‘30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను విడతలవారీగా భర్తీ చేస్తాం. 25 ఏళ్లలోపు డిప్లొమా హోల్డర్లకు కనీసం రూ.లక్ష వార్షిక వేతనం లేదా స్టైఫండ్‌తో మొదటి ఉద్యోగం వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకత ఉండేలా చట్టం తీసుకొస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకం అమల్లోకి తెస్తాం. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు రూ. 5,000 కోట్ల నిధులను కేటాయిస్తాం’’ అని ఆయన వివరించారు.

రాష్ట్రాలవారీగా..

కేరళకు సంబంధించి అత్యధికంగా 16 మంది లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఆ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ అభ్యర్థుల జాబితాలో రాహుల్‌ గాంధీ (వయనాడ్‌), కేసీ వేణుగోపాల్‌ (అళప్పుజ), డా. శశిథరూర్‌ (తిరువనంతపురం) ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్‌ (బెంగళూరు రూరల్‌) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. లక్షద్వీప్‌ (ఎస్టీ) నుంచి మహ్మద్‌ హమ్‌దుల్లా సయీద్‌‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. మేఘాలయ నుంచి ఇద్దరి పేర్లను అనౌన్స్ చేశారు. తురా (ఎస్టీ) స్థానం నుంచి సాలెంగ్‌ ఎ.సంగ్మ పోటీ చేయనున్నారు. నాగాలాండ్‌ ఎంపీ స్థానం నుంచి ఎస్‌.సుపోంగమెరెన్‌ జమీర్‌, సిక్కిం నుంచి గోపాల్‌ ఛెత్రి, త్రిపుర వెస్ట్‌ నుంచి ఆశిష్‌ కుమార్‌ సాహా పోటీ చేస్తారు.

Next Story

Most Viewed