'ఆయన విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు'.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్

by Disha Web Desk 13 |
ఆయన విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్
X

గోద్రా (గుజరాత్): రాహుల్ గాంధీ నడుపుతున్నది 'మొహబ్బత్ కీ దుకాణ్' (ప్రేమ దుకాణం) కాదని.. అది 'నఫ్రత్ కా మెగా మాల్'(విద్వేషపు మెగా మాల్) అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ఆ మెగా మాల్ ద్వారానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ అండ్ టీమ్ విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో జరిగిన పార్టీ సభలో జేపీ నడ్డా ఈ కామెంట్స్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కుటుంబ కేంద్రీకృత పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలు మారుతున్నాయని ఆయన విమర్శించారు. "ప్రధాని మోడీకి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందినప్పుడల్లా కాంగ్రెస్‌ వాళ్ళు మండిపడుతున్నారు. ప్రధానిని వ్యతిరేకించే క్రమంలో ఆ పార్టీ వాళ్ళు మన దేశాన్ని కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు" అని వ్యాఖ్యానించారు.

‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ గాంధీ బ్రిటన్ వరకు వెళ్లి చెప్పి వచ్చారు.. ఆయన అమ్మమ్మ (మాజీ ప్రధాని ఇందిరాగాంధీ) 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి 1.5 లక్షల మందిని జైల్లో పెట్టారు.. అలాంటి నేపథ్యం ఉన్నవాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు" అని నడ్డా పేర్కొన్నారు. "కాంగ్రెస్ ఇప్పుడు కుటుంబ ఆధారిత పార్టీగా మారింది. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనే ముగ్గురు వ్యక్తులతో కూడిన పార్టీ అయింది. ఇతర కాంగ్రెస్ నాయకులందరూ కాంట్రాక్ట్‌పై అందులో ఉన్నారు" అని ఆయన కామెంట్ చేశారు.

Next Story

Most Viewed