రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పూర్వీకుల ఇంటిపై దాడి.. దర్యాప్తుకు ఆదేశం

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్ జిల్లాలో నోబెల్ బహుమతి (Nobel Award) గ్రహీత, ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసం కచ్చరిబాడీ (Ravindra memorial museum)పై ఓ మూక దాడి చేసి విధ్వంసం సృష్టించింది.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పూర్వీకుల ఇంటిపై దాడి.. దర్యాప్తుకు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్ జిల్లాలో నోబెల్ బహుమతి (Nobel Award) గ్రహీత, ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసం కచ్చరిబాడీ (Ravindra memorial museum)పై ఓ మూక దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనను దర్యాప్తు చేసేందుకు పురావస్తు శాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ ఘటన తర్వాత సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

స్థానిక సమాచారం ప్రకారం, జూన్ 8న ఒక వ్యక్తి తన కుటుంబంతో కచ్చరిబాడీని సందర్శించేందుకు వచ్చాడు. అయితే.. మోటార్‌సైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో మ్యూజియం సిబ్బందితో వివాదం చెలరేగింది. ఈ వివాదం తీవ్రమై, సిబ్బంది ఆ వ్యక్తిని ఒక గదిలో నిర్బంధించి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. జూన్ 10న స్థానికులు మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ నిరసన తర్వాత 50-60 మంది గుండాలతో కూడిన ఒక మూక మ్యూజియం ఆడిటోరియంపై దాడి చేసి, కిటికీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది. సంస్థ డైరెక్టర్‌పై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

కచ్చరిబాడీ, రాజ్‌షాహీ డివిజన్‌లోని షాజాద్‌పూర్‌లో ఉంది. ఇది ఠాగూర్ కుటుంబానికి చెందిన పూర్వీకుల నివాసంగా, రెవెన్యూ కార్యాలయంగా ఉపయోగపడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నివాసంలో గణనీయమైన సమయం గడిపి, తన అనేక సాహిత్య రచనలను ఇక్కడే సృష్టించారు. ఈ దాడి ఘటన సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే వారిలో ఆందోళనను రేకెత్తించింది.

దర్యాప్తు కమిటీ ఈ ఘటనకు కారణాలను, బాధ్యులను గుర్తించేందుకు ఐదు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించబడింది. ప్రస్తుతం.. కచ్చరిబాడీని మూసివేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ నిషేధం కొనసాగనుంది.

Next Story