ప్రపంచ దేశాల ముంగిట పెను సంక్షోభం.. చమురు ధర 150 డాలర్లు అయ్యే అవకాశం

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-06 12:50:23  IST  )

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.

ప్రపంచ దేశాల ముంగిట పెను సంక్షోభం.. చమురు ధర 150 డాలర్లు అయ్యే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరా నిలిచిపోతే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Oil) ధర బ్యారెల్‌కు 150 డాలర్ల(భారతీయ కరెన్సీలో సుమారు రూ.13783)కు చేరుకోవచ్చని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ హెచ్చరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల తాము అంగీకరించిన ఒప్పందాల ప్రకారం చమురు సరఫరా చేయలేమని (Force Majeure) గల్ఫ్ దేశాలు ప్రకటించే అవకాశం ఉందని కాబీ తెలిపారు. "యుద్ధం ఇలాగే కొనసాగితే, రాబోయే కొద్ది రోజుల్లో ఎగుమతిదారులు అందరూ తమ చేతులెత్తేయక తప్పదు. చట్టపరమైన బాధ్యతల నుండి తప్పుకోవడానికి ఇది తప్ప వారికి మరో మార్గం లేదు," అని ఆయన 'ఫైనాన్షియల్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఖతార్ ఎల్‌ఎన్‌జీ (LNG) ప్లాంట్‌పై దాడి:

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరాదారు అయిన ఖతార్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఖతార్‌లోని అతిపెద్దదైన రాస్ లఫాన్ (Ras Laffan) ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా జరిగిన నష్టాన్ని ఖతార్ ఎనర్జీ ఇంకా అంచనా వేస్తోంది. మరమ్మతులు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వెల్లడించారు. యుద్ధం ఇప్పుడే ఆగిపోయినా, తిరిగి ఎగుమతులు సాధారణ స్థితికి రావడానికి వారాలు లేదా నెలలు పట్టవచ్చు. ఖతార్‌కు ఉన్న 128 ఎల్‌ఎన్‌జీ నౌకలలో ప్రస్తుతం కేవలం 6 లేదా 7 మాత్రమే సరుకును లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉండిపోయాయి. దాడుల ముప్పు పొంచి ఉండటంతో కేవలం 24 గంటల్లోనే 9,000 మంది ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. "మా సైన్యం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు మరియు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ జరిగే వరకు మేము ఉత్పత్తిని ప్రారంభించలేం. మా సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టలేం," అని సాద్ అల్-కాబీ స్పష్టం చేశారు.

Next Story