ఉక్రెయిన్‌కు వచ్చే విదేశీ దళాలను టార్గెట్ చేస్తాం.. ఈయూకు పుతిన్ వార్నింగ్

by Phanindra |

ఉక్రెయిన్‌కు దళాలను పంపేందుకు ఈయూ దేశాలు అంగీకరించాయి. దీనిపై స్పందించిన పుతిన్.. ఆ దళాలను తాము టార్గెట్ చేస్తామని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌కు వచ్చే విదేశీ దళాలను టార్గెట్ చేస్తాం.. ఈయూకు పుతిన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌కు మద్దతుగా వచ్చే విదేశీ దళాలను తాము లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత అక్కడ విదేశీ దళాలుంటే వాటిని టార్గెట్ చేసే న్యాయబద్ధమైన హక్కు తమకుంటుందని పుతిన్ తేల్చిచెప్పారు. అసలు యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు బలగాలను పంపాల్సిన అవసరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ రక్షణ కోసం దళాలను పంపేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకరించాయని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్‌కీ ఇటీవలే వెల్లడించారు.

దీనిపై స్పందించిన పుతిన్.. ఇలా బలగాలను మోహరించడం దీర్ఘకాలిక శాంతికి విఘాతం కలిగిస్తుందన్నారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న సైనిక సంబంధాలే రష్యాతో సంఘర్షణకు మూలకారణమని గుర్తుచేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిచర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు ఇతర దేశాల దళాలను పంపాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. దీర్ఘకాలిక శాంతి కావాలనుకుంటే.. ఉక్రెయిన్‌లో ఇతర దేశాల దళాలు మోహరించాల్సిన అవసరమే ఉండదని పుతిన్ చెప్పారు.

కాగా, గురువారం నాడు 26 ఐరోపా దేశాల నేతలు పారిస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై.. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్‌కు సైనిక సహకారం అందించేందుకు అంగీకరించారు. ఉక్రెయిన్‌ రక్షణ కోసం తమ దళాలను మోహరిస్తామని ఈ దేశాలు హామీ ఇచ్చాయని జెలెన్స్‌కీ తెలిపారు.

Next Story