ఇండియాతో ఆటలొద్దు.. పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్

by Dishanational4 |
ఇండియాతో ఆటలొద్దు.. పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. ఈ ఆధునిక ప్రపంచంలో భారత్‌లా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం అంత ఈజీ కాదన్నారు. అయితే 150 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి స్వతంత్రంగా వ్యవహరించే పూర్తి హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో విద్యార్థులతో సమావేశమైన పుతిన్ వారితో సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలు ఆడొద్దని పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి బయటి దేశాల నుంచి కుట్రలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని కామెంట్ చేశారు. నమ్మకమైన భాగస్వామిగా భారత్‌పై రష్యా ఆధారపడొచ్చని పేర్కొన్నారు. ‘‘భారత్‌తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంలో మాకు భారీగానే పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఇదంతా ప్రారంభం మాత్రమే’’ అని పుతిన్ చెప్పారు. భారత ప్రధాని మోడీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమం అమోఘమైన ఫలితాలను ఇస్తోందని ప్రశంసించారు. ‘‘భారతదేశానికి గొప్ప సంస్కృతి ఉంది. అది ఆసక్తికరంగా, వైవిధ్యంగా, రంగులమయంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. ‘‘జాతీయ టెలివిజన్ ఛానెళ్లలో భారతీయ చిత్రాలను క్రమం తప్పకుండా ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి. అలాంటి దేశం మరేదీ నాకు తెలియదు. మమ్మల్ని కనెక్ట్ చేసే అంశాలు చాలా ఉన్నాయి’’ అని పుతిన్ వివరించారు.



Next Story

Most Viewed