కోర్టు మెట్లు ఎక్కిన రాజ కుమారుడు .. లండన్ హైకోర్టుకు ప్రిన్స్ హ్యారీ

by Disha Web Desk 13 |
కోర్టు మెట్లు ఎక్కిన రాజ కుమారుడు .. లండన్ హైకోర్టుకు ప్రిన్స్ హ్యారీ
X

లండన్: వందల ఏళ్ళ బ్రిటీష్ రాజ కుటుంబ చరిత్రలో తొలిసారిగా ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పేందుకు కోర్టు మెట్లు ఎక్కాడు.. ఆయనే ప్రిన్స్ హ్యారీ!! తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో 1996 నుంచి 2010 మధ్యకాలంలో దాదాపు 2500 వార్తా కథనాలను పబ్లిష్ చేసినందుకుగానూ 'మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్' అనే మీడియా సంస్థపై ప్రిన్స్ హ్యారీ గతంలో కేసు వేశారు. ఫోన్ హ్యాకింగ్, ఇతర చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా తనకు తెలియకుండా సేకరించిన సమాచారంతో దాదాపు 140 న్యూస్ రిపోర్ట్స్‌ను పబ్లిష్ చేశారని ఆరోపించారు. ఈమేరకు అభియోగాలతో నమోదు చేసిన కేసుకు సంబంధించిన వాదనలు లండన్ హైకోర్టులో బుధవారం జరిగాయి.

ఈ సందర్భంగా సాక్ష్యం ఇచ్చేందుకు హ్యారీ నేరుగా అమెరికా నుంచి వచ్చారు. 'మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్' కు చెందిన జర్నలిస్టులు.. ప్రైవేట్ డిటెక్టివ్‌లతో చేయించిన గూఢచర్యం, మోసం వల్ల హ్యారీ వ్యక్తిగత జీవితానికి విఘాతం కలిగిందని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జర్నలిస్టుల గూఢచర్యం వల్ల చిరకాల స్నేహితురాలు చెల్సియా డేవీతో ప్రిన్స్ హ్యారీ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఇక ఇప్పటివరకు నాలుగు బ్రిటిష్ మీడియా సంస్థలపై హ్యారీ కేసులు వేశారు. అందులో ఈ కేసు కూడా ఒకటి. మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ కు చెందిన ఎన్జీఎన్ నిర్వహించే సన్ టాబ్లాయిడ్ పై, డైలీ మెయిల్ మాతృ సంస్థ అసోసియేటెడ్ న్యూస్‌పేపర్స్ (ANL)పై కూడా ఆయన దావాలు వేశారు.

Next Story