ప్రధాని మోడీ అవినీతికి చాంపియన్: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

by Dishanational2 |
ప్రధాని మోడీ అవినీతికి చాంపియన్: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి చాంపియన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో కలిసి బుధవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని విమర్శించారు. భారతదేశంలోని వ్యాపారవేత్తలందరికీ ఈ విషయం అర్థమైందని తెలిపారు. ఏఎన్ఐకి ప్రధాని మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తం స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. ‘ఈ సంభాషణలో మోడీ ఎలక్టోరల్ బాండ్స్ గురించి వివరిస్తూ..పారదర్శకత కోసమే ఆ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పారు. ఇదే నిజమైతే దానిని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది’ అని ప్రశ్నించారు. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకంగా అభివర్ణించారు. దీనిపై ప్రధాని ఎంత వివరణ ఇవ్వాలనుకున్నా ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జరిగే లోక్‌సభ ఎన్నికలు భావజాలానికి సంబంధించిన ఎన్నికలని అన్నారు. ‘ఒకవైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇండియా కూటమిఆ రెండు వ్యవస్థలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అతిపెద్ద సమస్యలు. కానీ వాటిపై ప్రధాని మోడీ, బీజేపీలు ఎన్నడూ మాట్లాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే అమేథీలో పోటీ చేయడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తప్పకుండా అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు.

బీజేపీ 150 సీట్లకే పరిమితం: అఖిలేశ్ యాదవ్

ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 150సీట్లకే పరిమితం అవుతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. ఇండియా కూటమికి బలమైన నాయకత్వం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఒక్క ఓటుకూడా చీలకుండా చూసుకోవాలని చెప్పారు. యూపీ ప్రజలు కూడా ఇండియా కూటమిని స్వాగతిస్తున్నారని తెలిపారు. బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కాగా, ఘజియాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాలీ శర్మ పోటీ చేస్తున్నారు.


Next Story

Most Viewed