Constitution of India: రాజ్యాంగం పిల్లల పెంపకం లాంటిది, దాన్ని మార్చలేం: జగదీప్ ధన్ కర్

by S Gopi |   (  Updated:2025-07-07 10:41:32  IST  )

చారిత్రాత్మకంగా, ఏ దేశ పీఠికను ఎప్పుడూ మార్చలేదని అభిప్రాయపడ్డారు.

Constitution of India: రాజ్యాంగం పిల్లల పెంపకం లాంటిది, దాన్ని మార్చలేం: జగదీప్ ధన్ కర్
X

దిశ నేషనల్ బ్యూరో: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో.. మన రాజ్యాంగ పీఠిక పిల్లలకు తల్లిదండ్రుల పెంపకం లాంటిదని, ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చడం సాధ్యమవదని అన్నారు. సోమవారం కొచ్చిలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ (ఎన్ యూ ఏ ఎల్ ఎస్) లో విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషణ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజ్యాంగ పీఠిక విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఇది పిల్లలను పెంచడం లాంటిది, ఎవరు ఎంత ప్రయత్నించినా వారి పెంపకంలో నుంచి వచ్చిన లక్షణాలే కొనసాగుతాయి. ఎవరూ మార్చలేరు. అది కుదరదు ' అన్నారు. చారిత్రాత్మకంగా, ఏ దేశ పీఠికను ఎప్పుడూ మార్చలేదని, కానీ ఎమర్జెన్సీ సమయంలో భారత రాజ్యాంగాన్ని మార్చడం విచారకరమని అభిప్రాయపడ్డారు. మన ప్రజాస్వామ్యంలో అత్యంత చేదు కాలమైన ఎమర్జెన్సీ సమయంలో మన రాజ్యాంగ పీఠికను మార్చారు.

అందులో 'సోషలిస్ట్' 'లౌకిక' అనే పదాలను పునఃపరిశీలించాలని ఆర్‌ఎస్‌ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎమర్జెన్సీ సమయంలోనే ఈ పదాలను చేర్చారు, బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో ఇవి ఎప్పుడూ భాగం కాదని ఆయన అన్నారు.

జూన్ 26న న్యూఢిల్లీలో జరిగిన 50 ఏళ్ల అత్యవసర పరిస్థితిపై జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే మాట్లాడుతూ, ' బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికలో ఈ పదాలను ఎప్పుడూ ఉపయోగించలేదు. అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు నిలిపివేయబడినప్పుడు, పార్లమెంట్ పనిచేయనప్పుడు, న్యాయవ్యవస్థ కుంటుపడిన సమయంలో ఈ పదాలు చేర్చారు', అని పేర్కొన్నారు.

Next Story