మేఘా, భారతీతో బీజేపీ క్విడ్ ప్రోకో : ప్రశాంత్ భూషణ్

by Dishanational4 |
మేఘా, భారతీతో బీజేపీ క్విడ్ ప్రోకో : ప్రశాంత్ భూషణ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇచ్చిన తర్వాత భారతీ టెలికాం , మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రా వంటి పలు కంపెనీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఎన్నికల బాండ్లను క్విడ్ ప్రోకో సాధనాలుగా బీజేపీ దుర్వినియోగం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రశాంత్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.585 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఓ విడతలో రూ.140 కోట్ల విరాళం ఇచ్చిన నెలలోపే మేఘా సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.14వేల కోట్లు విలువైన సొరంగం నిర్మాణ కాంట్రాక్టును కట్టబెట్టింది. రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో కాశ్మీర్‌లో నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా మరోసారి ఎన్నికల బాండ్లను మేఘా కొనుగోలు చేసింది’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు.

‘‘4జీ స్పెక్ట్రమ్ వేలం వేస్తున్న టైంలో భారతీ టెలికాం కంపెనీ కూడా పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలను అందించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం 4జీ స్పెక్ట్రమ్‌కు వేలం వేసే పద్ధతికి స్వస్తి పలికి, నామినేషన్ పద్ధతిని తీసుకొచ్చింది. దీంతో భారతీ టెలికాంకు 4జీ స్పెక్ట్రమ్ దక్కేందుకు లైన్ క్లియర్ అయింది’’ అని ఆయన తెలిపారు. ‘‘గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీకి కలిసొచ్చేలా భారతదేశ దిగుమతి పాలసీని కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇందుకు ప్రతిగా గ్రాసిమ్ కంపెనీ ఎన్నికల బాండ్లు కొని బీజేపీకి లబ్ధి చేకూర్చింది’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed