‘నో పొల్యూషన్‌’ సర్టిఫికెట్‌ లేదని.. ఈవీ కారుకు ఫైన్‌ : రాజస్తాన్‌లో పోలీసుల అత్యుత్సాహం

by Ramesh Naini |

కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదన్న కనీస నిబంధనను మర్చిపోయిన ఓ పోలీస్ అధికారి.. ఏకంగా ఈవీ కారుకే జరిమానా విధించిన ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది.

‘నో పొల్యూషన్‌’ సర్టిఫికెట్‌ లేదని.. ఈవీ కారుకు ఫైన్‌ : రాజస్తాన్‌లో పోలీసుల అత్యుత్సాహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) అవసరం లేదన్న కనీస నిబంధనను మర్చిపోయిన ఓ పోలీస్ అధికారి.. ఏకంగా ఈవీ కారుకే జరిమానా విధించిన విచిత్ర ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. జాతీయ మీడియా తెలిపిన ప్రకారం.. రాజస్తాన్‌లోని నాగార్‌లో ఓ వ్యక్తి తన ‘టాటా టియాగో ఈవీ’ కారులో వెళ్తుండగా.. అద్దాలకు ఉన్న సన్‌షేడ్స్‌ను చూసి స్థానిక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) కారును ఆపాడు. వాటిని తొలగించే విషయంపై కారు యజమానికి, పోలీసు అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సన్‌షేడ్స్ వాడినందుకు రూ.200 ఫైన్ వేసిన సదరు ఏఎస్ఐ.. తన ప్రతాపాన్ని చూపిస్తూ కారుకు ‘పొల్యూషన్ సర్టిఫికెట్’ లేదంటూ అదనంగా మరో రూ.1,500 జరిమానా విధించాడు. ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ అవసరం లేదని యజమాని ఎంత చెప్పినా ఆ అధికారి వినిపించుకోలేదు.

పొరపాటే అన్న ఉన్నతాధికారులు..!

కారు యజమాని, పోలీసు మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు.. గందరగోళం మధ్య పొరపాటున కాలుష్య ఉల్లంఘన కింద చలాన్ విధించారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఆ తప్పుడు జరిమానాను సిస్టమ్ నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

గమనిక: కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (CMVR) 1989 ప్రకారం.. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్యాన్ని వెలువరించవు. కాబట్టి, ఇంధనాలతో (పెట్రోల్/డీజిల్) నడిచే వాహనాలకు తప్ప, ఈవీలకు పీయూసీ (PUC) సర్టిఫికెట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

Next Story