నేడు కర్నాటక, గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

by Kema Shiva Kumar |

భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ గీతా పఠనం, రాముడి విగ్రహ ఆవిష్కరణలతో సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక, గోవా రాష్ట్రాలకు పర్యటించబోతున్నారు.

నేడు కర్నాటక, గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ గీతా పఠనం, రాముడి విగ్రహ ఆవిష్కరణలతో సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక, గోవా రాష్ట్రాలకు పర్యటించబోతున్నారు. ముందుగా ప్రధాని ఉదయం 11.30కి కర్నాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్ష కంఠ గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో విద్యార్థులు, మునులు, పండితులు, సామాన్య పౌరులతో కలిసి 1 లక్ష మంది భగవద్గీతను కంఠస్థంగా పఠించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉడుపిలో 10 మంది ఎస్పీలు, 27 డీఎస్పీలు, 1,608 కానిస్టేబుల్స్, 6 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కలిపి మొత్తం 2 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. చివరగా రోడ్ షో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అనంతరం అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3:15కు సౌత్ గోవాలోని కుశవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని సందర్శించి మఠం 550వ వార్షికోత్సవ స్మృతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అయితే, ఆ విగ్రహాన్ని రామ్ సుతార్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి) తయారు చేశారు. ఇది త్వరలోనే గోవా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది. ఆ వెంటనే రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభించి, ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణెన్ని విడుదల చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపద్ నాయక్ పాల్గొంటారు.

Next Story