తెలంగాణతో సహా 7 రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు

by Disha Web Desk 17 |
తెలంగాణతో సహా 7 రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణాతో సహా ఏడు రాష్ట్రాల్లో కేంద్రం పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘పొలం(ఫామ్)-ఫైబర్- ఫ్యాక్టరీ- ఫ్యాషన్- విదేశీ(ఫారిన్) వరకు 5 ఎఫ్ విధానంలో టెక్స్‌టైల్స్ రంగానికి పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్స్ ఊతం ఇవ్వనున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేయడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.

టెక్స్‌టైల్స్ రంగంలో మౌళికవసతులను ఈ పార్కులు అందిస్తాయని చెప్పారు. కోట్లలో పెట్టుబడులను ఆకర్షించి లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందని చెప్పారు. ఇది మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌కు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్ కింద రూ.1,536 కోట్ల పెట్టుబడులు వచ్చాయని టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. టెక్స్‌టైల్ పరిశ్రమ కోసం, ప్రభుత్వం టెక్స్‌టైల్స్ పరిమాణం, స్థాయిని సాధించడానికి, పోటీగా మారడానికి రూ.10,683 కోట్ల ఆమోదిత ఆర్థిక వ్యయంతో పథకాన్ని ప్రారంభించింది.

ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ కింద 67 దరఖాస్తులు రాగా, 64 ఎంపిక చేశారు. వీటిలో 56 కొత్త కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసుకోగా, అప్రూవల్ లేటర్లను కూడా అందించారు. 2027-28 వరకు రూ.4,445 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 7 పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.



Next Story

Most Viewed