నేడు లోక్‌సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ

by Naga Rani Yarlagadda |

భారత జాతీయ గీతమైన “వందేమాతరం” 150వ జయంతి సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.

నేడు లోక్‌సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జాతీయ గీతమైన “వందేమాతరం” 150వ జయంతి సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. సోమవారం లోక్‌సభలో ఈ చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సమయంలో ఆయన జాతీయ గీతం గురించి కొన్ని కీలక విషయాలు, చారిత్రక నిజాలు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ పాటలోని కొన్ని భాగాలను తొలగించిందని మోదీ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చర్చ సమయంలో సభలో గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

లోక్‌సభ షెడ్యూల్ ప్రకారం.. ఈ అంశంపై సుమారు 10 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ మొదటి వక్తగా మాట్లాడనుండగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్పీకర్‌గా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీతో సహా ఇతర ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. లోక్‌సభలో చర్చ ముగిసిన తర్వాత.. మంగళవారం రాజ్యసభలో కూడా “వందేమాతరం”పై చర్చ జరుగుతుంది. ఇక్కడ హోం మంత్రి అమిత్ షా మొదటి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ఆరోగ్య మంత్రి, రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా మాట్లాడతారు. రెండు సభల్లోనూ ఈ చర్చలు భారత జాతీయతకు ప్రతీకగా నిలిచిన “వందేమాతరం” చారిత్రక, సాంస్కృతిక విలువలను మరింత ముందుకు తెస్తాయి.

ఇటీవల డిసెంబర్ 2న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చకు అంగీకారం తెలిపారు. చరిత్రలోకి వెళ్తే.. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ 1875లో ఈ పాటను రాశారు. ఇది 1882లో ప్రచురితమైన ఆయన ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’లో భాగం. స్వరాలు సమకూర్చినది జదునాథ్ భట్టాచార్య. స్వాతంత్ర్య సమరంలో లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా మారిన ఈ గీతం, 1950లో భారత గణతంత్ర రాజ్యాంగంలో జాతీయ గీతంగా అధికారిక గుర్తింపు పొందింది.

Next Story