మహిళా రిజర్వేషన్లకు లైన్ క్లియర్ చేసింది మేమే : మోడీ

by Dishanational4 |
మహిళా రిజర్వేషన్లకు లైన్ క్లియర్ చేసింది మేమే : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్, వామపక్షాలే మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నాయని.. దానికి లైన్ క్లియర్ చేసింది తమ ప్రభుత్వమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. బీజేపీ సర్కారు చూపిన చొరవ వల్లే పార్లమెంటు ఉభయ సభల్లో ఆ బిల్లుకు ఆమోదం లభించిందని చెప్పారు. కేరళ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన త్రిసూర్‌ నగరం వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పూరించారు. ఈసందర్భంగా త్రిసూర్‌లోని తేక్కింకాడులో 2 లక్షల మంది మహిళలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లిం మహిళలకు సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని చేసిందన్నారు.

కేరళ నారీమణులు పీటీ ఉష, అంజు బాబీ జార్జ్ స్ఫూర్తి ప్రదాతలు

ఈసభ సందర్భంగా సావిత్రీబాయి ఫూలేకు నివాళులర్పించిన ప్రధాని మోడీ.. కేరళ నారీమణులు పీటీ ఉష, అంజు బాబీ జార్జ్ అందరికీ స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు. ‘‘అదృష్టవశాత్తు నేను శివ్ కీ నగరి అని పిలువబడే కాశీ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిని. ఇక్కడ కూడా వడక్కునాథన్ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. కేరళ సాంస్కృతిక రాజధాని త్రిసూర్ నుంచి వెలువడుతున్న ఈ శక్తి మొత్తం కేరళలో కొత్త ఆశను ప్రతిధ్వనింపజేస్తుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ త్రిసూర్‌లో దాదాపు కిలోమీటరున్నర మేర ఓపెన్ టాప్ జీపులో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా రోడ్డుపొడవునా ఆయనపై ప్రజలు పూల వర్షం కురిపించారు. నగరమంతా ఎటుచూసినా బీజేపీ జెండాలే కనిపించాయి.



Next Story

Most Viewed