పశ్చిమాసియా సంక్షోభం: ఇంధన కొరతపై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-22 11:53:28  IST  )

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

పశ్చిమాసియా సంక్షోభం: ఇంధన కొరతపై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా భారత్‌లో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారు. ఆదివారం ఢిల్లీ వేదికగా ప్రధాని అధ్యక్షతన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రులందరూ పాల్గొని దేశంలో చమురు నిల్వలు, సరఫరా గొలుసుపై సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియా దేశాల నుండి భారత్‌కు పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి అవుతున్న నేపథ్యంలో, యుద్ధం వల్ల సరఫరాకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రధాని ఆరా తీశారు. దేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగితే, దాని ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ఉండటానికి అనుసరించాల్సిన ఆర్థిక వ్యూహాలపై చర్చించారు.

అడ్డంకులు లేని సరఫరానే లక్ష్యం..

ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యుద్ధం వల్ల దిగుమతులకు ఆటంకం కలగకుండా చూడటం. సరుకు రవాణా మార్గాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవడం. దేశవ్యాప్తంగా వినియోగదారులకు, పరిశ్రమలకు ఎక్కడా కొరత రాకుండా పంపిణీ చేయడం. మరోవైపు.. మార్చి 12న మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని తెచ్చిపెట్టిందని, దీనిని శాంతి, సహనం మరియు ప్రజల అవగాహనతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రజల మరియు పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Next Story