మోడీ, మాక్రాన్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ఆపే మార్గాలపై చర్చలు

by Phanindra |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ఆపే మార్గాలపై వీరు చర్చించారు.

మోడీ, మాక్రాన్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ఆపే మార్గాలపై చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించే అంశంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడితో మంచి సంభాషణ జరిగిందని మోడీ తెలిపారు. ‘పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై పాజిటివ్‌గా చర్చించాం. అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై మాట్లాడాం. ఉక్రెయిన్ సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపాం. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం కోసం భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానిది కీలకమైన పాత్ర’ అని మోడీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

మాక్రాన్ కూడా మోడీతో తన సంభాషణ గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘జెలెన్స్‌కీతో మా కూటమి చర్చలు, అప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీకి వివరించాం. ఉక్రెయిన్‌లో న్యాయమైన, సుస్థిరమైన శాంతిని స్థాపించే విషయంలో భారత్, ఫ్రాన్స్ ఒకే ఆలోచనను కలిగి ఉన్నాయి. మా స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యంతో స్థిరమైన శాంతి వైపు ఈ మార్గంలో నడుస్తాం’ అని మాక్రాన్ పేర్కొన్నారు.

Next Story