ఆ మరణవార్తలు విని గుండె తరుక్కుపోతోంది : ఇంద్రా నూయి

by Dishanational4 |
ఆ మరణవార్తలు విని గుండె తరుక్కుపోతోంది : ఇంద్రా నూయి
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో భారత విద్యార్థుల మరణవార్తలు విని తన గుండె తరుక్కుపోతోందని భారత సంతతికి చెందిన పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి పేర్కొన్నారు. 45 ఏళ్ల క్రితం తాను కూడా ఒక విద్యార్థిగానే అమెరికాకు వచ్చి.. పెప్సీకో లాంటి దిగ్గజ కంపెనీలో ఉన్నత స్థానాలకు ఎదిగానని ఆమె గుర్తు చేసుకున్నారు. కెరీర్‌పై కొత్త ఆశలతో అమెరికాకు వస్తున్న భారతీయ విద్యార్థులు యూనివర్సిటీ, కోర్సు ఎంపిక దగ్గరి నుంచి మొదలుకొని స్నేహితుల ఎంపిక దాకా ప్రతీవిషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈమేరకు ఇంద్రా నూయి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీన్ని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘రాత్రివేళల్లో కొత్త ప్రదేశాలకు అనవసర ప్రయాణాలు మానుకోండి. కొందరు భారత యువత అమెరికాలో మద్యం, ఫెంటానిల్ వంటి ప్రమాదకర డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు లభిస్తుంది’’ అని ఇంద్రానూయి తెలిపారు. అమెరికాలోని స్థానిక చట్టాల గురించి తెలుసుకొని, వాటి ప్రకారం నడుచుకోవాలన్నారు. ‘‘మీరు పార్ట్ టైం ఉద్యోగానికి అర్హులా ? కాదా ? అనేది మీరు పొందిన వీసా స్వభావాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. అది తెలుసుకోండి’’ అని భారతీయ విద్యార్థులకు సూచించారు. ఆన్‌లైన్ స్కాంల బారినపడి డబ్బులు కోల్పోకుండా అలర్ట్ ఉండాలని కోరారు.



Next Story

Most Viewed