పోలీసులపై ‘పార్లమెంటుపై దాడి’ కేసు నిందితుల సంచలన ఆరోపణలివీ..

by Dishanational4 |
పోలీసులపై ‘పార్లమెంటుపై దాడి’ కేసు నిందితుల సంచలన ఆరోపణలివీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసు నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, లలిత్ ఝా, అమోల్ షిండే, మహేష్ కుమావత్‌లు పోలీసుల విచారణ తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా తమను దారుణమైన హింసకు గురిచేశారని ఆరోపించారు. ఈమేరకు ఆరోపణలతో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని ప్రకారం.. ‘‘70 వైట్ పేపర్లపై సంతకాలు చేయాలని మమ్మల్ని పోలీసులు బలవంతపెట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద నేరాన్ని అంగీకరించాలని చెప్పారు. ఇవన్నీ అంగీకరించాలంటూ విద్యుత్ షాక్‌లు ఇస్తూ చిత్రహింసలు చేశారు’’ అని నిందితులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల సమయంలోనూ టార్చర్ చేశారు. ఏదైనా రాజకీయ పార్టీతో, నాయకుడితో సంబంధం ఉందని ఒప్పుకోవాలన్నారు’’ అని వారు తెలిపారు. ‘‘మా పాత ఫోన్ నంబర్, కొత్త ఫోన్ నంబర్ల వివరాలను పోలీసులు అడిగారు. ఆన్‌లైన్ సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఖాతాలు, మొబైల్ ఫోన్‌ల పాస్‌వర్డ్‌లను బలవంతంగా అడిగి తీసుకున్నారు’’ అని నిందితులు ప్రస్తావించారు.బుధవారం రోజు ఈ నిందితులను ఢిల్లీలోని అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ఎదుట హాజరుపరిచారు. ఈసందర్భంగా న్యాయమూర్తి వారి జ్యుడీషియల్ కస్టడీని మార్చి 1 వరకు పొడిగించారు. పోలీసుల విచారణ తీరుపై ఆరోపణలతో వేసిన పిటిషన్‌పై స్పందనను సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.దీనిపై విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.


Next Story