బిహార్ ఎంపీ పప్పు యాదవ్ పై కేసు నమోదు

by Shamantha N |
బిహార్ ఎంపీ పప్పు యాదవ్ పై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌ అలియాస్ రాజేష్ రంజన్ పై కేసు నమోదైంది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున (జూన్‌ 4న) తన ఇంటికి పిలిపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడని పప్పు యాదవ్ పై వ్యాపారి కేసు పెట్టాడు. డబ్బు ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని ఆ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. వచ్చే ఐదేళ్లు తాను ఎంపీగా ఉంటానని హెచ్చరించినట్లు తెలిపాడు. దీంతో జూన్ 10న పూర్నియా పోలీసులు పప్పు యాదవ్ పై కేసు నమోదు చేశారు. పప్పు యాదవ్ ఇంతకుముందు 2021 మరియు 2023లో ఇలానే బెదిరింపిచనట్లు వ్యాపారి తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎంపీ, అతని సహచరుడు అమిత్ యాదవ్‌పై కేసు నమోదైంది. దీనిపై పూర్ణియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పూర్ణియా ఎంపీగా గెలుపు

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్ణియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి పప్పు యాదవ్ గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన జేడీయూ నేత సంతోశ్‌ కుష్వాహాను ఓడించారు. పప్పు యాదవ్ కు కాంగ్రెస్ నుంచి టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా పూర్ణియా స్థానం ఆర్జేడీకి దక్కింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కాగా.. తాను ఇండియా కూటమికే మద్దతు ఇస్తానని పప్పు యాదవ్ ప్రకటించారు.



Next Story

Most Viewed