Indian Railway: క్యాష్ ఆన్ వీల్స్.. చరిత్రలో తొలిసారి రైల్లో ఏటీఎం సదుపాయం

by S Gopi |

ముంబై-మన్మాడ్ మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేసింది.

Indian Railway: క్యాష్ ఆన్ వీల్స్.. చరిత్రలో తొలిసారి రైల్లో ఏటీఎం సదుపాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ రైల్వే అరుదైన ఘనతను సాధించింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రన్నింగ్ ట్రైన్‌లో సొమ్ము విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. దీనికోసం ముంబై-మన్మాడ్ మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎంను ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ చైర్ కార్ కోచ్‌లో ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రైలు కదులుతున్నప్పుడు కూడా ప్రయాణికులు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని భారతీయ రైల్వే ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్(ఐఎన్ఎఫ్ఆర్ఐఎస్)లో భాగంగా తీసుకొచ్చామని అధికారులు వివరించారు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన భుసావల్ డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య సహకారం ద్వారా ఇది సాధ్యమైంది. అయితే, సొరంగాలు, తక్కువ మొబైల్ కనెక్టివిటీ ఉన్న చోట సిగ్నల్ సమస్య వల్ల సమస్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ట్రయల్ రన్‌లో ఇబ్బందులేమీ తలెత్తలేదు. కాబట్టి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇబ్బందుల్లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఏటీఎం పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని వారు పేర్కొన్నారు.

Next Story