పీఓకేలో పాక్ దళాల కాల్పులు.. ఆరుగురు పౌరులు మృతి

by Prasad Jukanti |   (  Updated:2026-07-14 11:35:03  IST  )

పీఓకేలో పౌరులపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పాక్ అణచివేత చర్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీఓకేలో పాక్ దళాల కాల్పులు.. ఆరుగురు పౌరులు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో ఆందోళనలు మరోసారి ఉధృతం అయ్యాయి. రావల్ కోట్ పరిధిలోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డాయి. నిరసనకారులను చెదరగొట్టే నెపంతో పాక్ సైనిక, పారామిలిటరీ దళాలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పాక్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా స్థానికుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఈ తాజా రక్తపాతంతో మరింత తీవ్రరూపం దాల్చింది.

వైట్ హౌస్ చేరిన పీఓకే నిరసన గళం:

తాజాగా జరిగిన ఈ దారుణానికి సరిగ్గా ఒక రోజు ముందే అమెరికాలోని వాషింగ్టన్‌లో నివసిస్తున్న పీఓకే కమ్యూనిటీ ప్రతినిధులు వైట్ హౌస్ వెలుపల భారీ ప్రదర్శన చేపట్టారు. మహిళలు, పిల్లలతో సహా సుమారు 100 మందికి పైగా ఈ నిరసనలో పాల్గొని తీవ్ర మానవీయ సంక్షోభాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లారు. పీఓకే పౌర నివాస ప్రాంతాల నుండి పాక్ సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం విధించిన ఇంటర్నెట్ బంధనాన్ని (బ్లాకౌట్) ఎండగట్టారు. తమ ప్రాణాలను కాపాడటానికి, మానవీయ సహాయం అందించడానికి భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నిరసనకారులు అసాధారణ విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో పూంచ్, దోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖ (LoC) ను తెరవాలని కూడా కోరారు.

ఇది వ్యవస్థీకృత దోపిడే.. పాకిస్తాన్‌పై భారత్ ఆగ్రహం:

పాకిస్తాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగిస్తున్న వ్యవస్థీకృత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేతకు పీఓకే లో జరుగుతున్న నిరసనలే ప్రత్యక్ష నిదర్శనం అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయడం, పోలీసుల క్రూరత్వం, ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌లను అమలు చేయడం వంటి చర్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌ను భారత్ తీవ్రంగా విమర్శించింది. నిరాయుధ పౌరులపై ప్రాణాంతక బలప్రయోగం చేసిన ఫలితంగా విషాదకరమైన ప్రాణనష్టం జరిగిందని ఆయన అన్నారు. పౌరులపై సాగిస్తున్న అణచివేతకు అంతర్జాతీయ సమాజం పాక్‍ను జవాబుదారీగా చేయాలని భారత్ పేర్కొంది.

Next Story