పాకిస్తాన్ సపోర్టర్స్‌ను కాల్చి చంపేయాలి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

by Dishanational4 |
పాకిస్తాన్ సపోర్టర్స్‌ను కాల్చి చంపేయాలి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసేవారిని కాల్చి చంపాలన్నారు. ‘‘ఏమైంది.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇమేజ్ బాగానే ఉంది.. ఎవరైనా పాక్ అనుకూల నినాదాలు చేస్తే కాల్చి చంపితే సరి.. అందులో ఎలాంటి తప్పూ లేదు’’అని రాజన్న శనివారం కామెంట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అమలుచేస్తున్న బుల్డోజర్ చర్యను కూడా ఆయన సమర్ధించారు. బుల్డోజర్లతో వివిధ కేసుల నిందితుల ఇళ్లను కూల్చేయడం వల్ల యూపీలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని రాజన్న అభిప్రాయపడ్డారు. ‘‘బుల్డోజర్లతో వివిధ కేసుల నిందితుల ఇళ్లను కూల్చివేయాలనే చట్టమేదీ లేదు. అయినా అలా చేయడం వల్ల శాంతిభద్రతలు అదుపులోకి వస్తున్నాయి. అందుకే దాన్ని నేను వ్యతిరేకించబోను’’ అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఆ వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలో పలువురు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలతో ఆ నినాదాలు చేసిన వారిపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరిగింది. అనంతరం నినాదాలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ నసీర్ హుస్సేన్ పేరును కూడా చేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేసు విచారణ పూర్తయ్యే వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి నసీర్‌ హుస్సేన్‌‌ను అనుమతించొద్దని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను కోరుతామని బీజేపీ నేతలు తెలిపారు.

Next Story

Most Viewed