- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pakistan: మరోసారి తెరపైకి బహిష్కరణ అంశం తెచ్చిన పాక్

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (Pakistan)లో బహిష్కరణల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అఫ్గానిస్థాన్ (Afghanistan) నుంచి వచ్చి పాక్లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అఫ్గాన్ నుంచి శరణార్థులుగా (Refugees) వచ్చినవారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు సోమవారంతో ముగియడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ వాసులను , ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి 2023 అక్టోబర్ నుంచి పాక్ ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి బహిష్కరించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా బహిష్కరణలను ఈ నెల 10 వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ సిటిజన్ కార్డు ఉన్నవారు స్వచ్ఛందంగా ఇస్లామాబాద్ను వదిలి వెళ్లాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బహిష్కరణకు గురైన వారు తిరిగి పాకిస్థాన్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
పాక్ చర్యలపై అఫ్గాన్ ఆగ్రహం
మరోవైపు, పాక్ చర్యలపై అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మండిపడుతోంది. తమ పౌరులను బహిష్కరించడానికి పాక్ చర్యలు తీసుకోవడంతో అఫ్గానిస్థాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ముతాలిబ్ ఓ ప్రకటన చేశారు. శరణార్థులు గౌరవంగా తమ దేశానికి తిరిగి రావాలని కోరారు. తాలిబన్ ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పాక్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.ఇకపోతే, గత 18 నెలల్లో సుమారు 8వేలకు పైగా అఫ్గానీయులు పాక్ను వీడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 3 మిలియన్ల మంది అఫ్గానిస్థాన్వాసులు ఆశ్రయం పొందుతున్నారని.. ఎటువంటి పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా మరో మిలియన్ మంది ఉంటున్నారని పేర్కొన్నాయి.