రెండు నెలల్లో పాక్‌కు రూ.1,240 కోట్ల నష్టం!

by Phanindra |

రెండు నెలల్లో పాక్‌కు రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లింది. భారత్‌కు ఎయిర్ స్పేస్ నిషేధించడంతోనే పాక్‌కు ఈ భారీ నష్టం జరిగిందని ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరించారు.

రెండు నెలల్లో పాక్‌కు రూ.1,240 కోట్ల నష్టం!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల పాకిస్తాన్‌కు రెండు నెలల్లో ఏకంగా రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ దేశ రక్షణ శాఖ ఈ వివరాలు వెల్లడించినట్లు పాక్‌కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమానాలకు తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం వల్ల పాక్‌కు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24న భారత విమానాలకు ఎయిర్‌స్పేస్ నిషేధించగా.. అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్రమైన నష్టాలు ఎదుర్కొందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ధ్రువీకరించారు. ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించుకున్నందుకు ఆయా వైమానిక సంస్థలు సదరు దేశాలకు కొంత మొత్తం చార్జీలు చెల్లిస్తాయి.

భారత విమానాలను నిషేధించడంతో పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (పీఏఏ) ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతిరోజూ సుమారు 100-150 భారత విమానాలు పాక్ మీదుగా వెళ్లేవి. ఇది ఆ దేశ ఎయిర్ ట్రాఫిక్‌లో సుమారు 20 శాతం కావడం గమనార్హం. అయితే నిషేధం తర్వాత ఈ విమానాలన్నీ పాక్‌ వైపు వెళ్లడం లేదు. దీంతో గత రెండు నెలల్లో పీఏఏకు రూ.1,240 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

Next Story