UN: ఐక్యరాజ్యసమితిలో పాక్ కు షాక్.. దాయాదిపై ప్రశ్నల వర్షం

by Shamantha N |

అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టాలనుకున్న పాక్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్‌ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

UN: ఐక్యరాజ్యసమితిలో పాక్ కు షాక్.. దాయాదిపై ప్రశ్నల వర్షం
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టాలనుకున్న పాక్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్‌ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. దీంతో, దాయాదికే సభ్య దేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో పాక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో క్లోజ్డ్‌డోర్‌ సమావేశం జరిగింది. ఇప్పటికే సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో ఇస్లామాబాద్‌ ఒకటి. అయితే, ఆ దేశం అభ్యర్థన పైనే ఈ సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకొని భారత్‌ వ్యతిరేక తీర్మానం చేయాలని పాక్ అనుకుంది. కాకపోతే, దాయాదికే సభ్యదేశాల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో దానికి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. పాక్‌ తరఫున ఐరాస శాశ్వత ప్రతినిధి అసీమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ హాజరయ్యారు.

పాక్ కు ప్రశ్నలు..

పహెల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు.. ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై సభ్యదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇస్లామాబాద్‌ బహిరంగ అణు బెదిరింపులపై చాలా సభ్యదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇటీవలే పాక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశ్నించాయి. అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందన్నాయి. అదే సమయంలో భారత్‌ కుట్రపన్ని పహెల్గాం దాడి చేసుకొని(ఫాల్స్‌ఫ్లాగ్‌ ఆపరేషన్‌).. పాక్‌పై నిందలు మోపుతోందన్న వాదనలను కూడా సభ్యదేశాలు తిరస్కరించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చిచెప్పాయి. పాక్‌ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకొన్నా.. ఏ దేశమూ దానితో పనిచేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా సమావేశం తర్వాత ప్రెస్‌ స్టేట్‌మెంట్‌లో ఏమీ మాట్లాడలేదు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు చాలా దేశాలు సలహా ఇచ్చాయి.

Next Story