గుజరాత్‌‌లో ఆ రెండు స్థానాలే మజ్లిస్ టార్గెట్.. ఎందుకు ?

by Dishanational4 |
గుజరాత్‌‌లో ఆ రెండు స్థానాలే మజ్లిస్ టార్గెట్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోనూ పోటీ చేయనుంది. ఆ రాష్ట్రంలోని భరూచ్, గాంధీనగర్ లోక్‌సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను మజ్లిస్ చీఫ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ‘‘భరూచ్, గాంధీనగర్ రెండింటిలోనూ ముస్లిం జనాభా గణనీయమైన సంఖ్యలో ఉంది. ఇది మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు కలిసొస్తుంది’’ అని మజ్లిస్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2026లో జరిగే గాంధీనగర్ కార్పొరేషన్ ఎన్నికలే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. గాంధీనగర్ హై ప్రొఫైల్ సీటు. గతంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఈ స్థానం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి గుజరాత్ కాంగ్రెస్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోనాల్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. భరూచ్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసవకు బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇక ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా భరూచ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ పొందింది. ఇక్కడి నుంచి ఆప్ అభ్యర్థిగా చైతర్ వాసవ పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 నియోజకవర్గాలకు మే 7న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.

Next Story

Most Viewed