Terror Attack: జమ్ముకశ్మీర్ లో చిక్కుకున్న 50 మంది గోవా వాసులు

by Shamantha N |
Terror Attack: జమ్ముకశ్మీర్ లో చిక్కుకున్న 50 మంది గోవా వాసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత అనేక మంది టూరిస్టులు శ్రీనగర్ హోటళ్లలో చిక్కుకుపోయారు. గోవా నుంచి వెళ్లిన దాదాపు 50 మంది పర్యాటకులు శ్రీనగర్ లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పెహల్గామ్ సహా సమీప ప్రాంతంలోని సందర్శకులను శ్రీనగర్‌లోని హోటళ్లకు తరలించినట్లు గోవా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గోవా నుండి వెళ్లిన 50 మందికి పైగా వ్యక్తులు ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు పర్యాటకులను తిరిగి తీసుకురావడానికి గోవా నుండే టూర్ ఆపరేటర్లు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దాడి జరిగినప్పుడు గోవాకు చెందిన ఒక బృందం పెహల్గామ్ మార్కెట్‌లో ఉందని.. మరొక బృందం సోనామార్గ్‌లో ఉందని పనాజీలోని టూర్ కంపెనీ గోవా అడ్వెంచర్ క్లబ్ కో ఫౌండర్ అహ్రాజ్ ముల్లా అన్నారు. వారందరినీ శ్రీనగర్ లోని ఓ హెటల్ కి తరలించినట్లు తెలిపారు. 34 మందితో కూడిన బృందం పెహల్గామ్‌కు, మరో 12 మందితో కూడిన బృందం జమ్మూకు ఒక యాత్రను ప్లాన్ చేసిందని ముల్లా చెప్పారు. జమ్మూలో ఉన్న వారు కొండచరియలు విరిగిపడటం వల్ల చిక్కుకుపోయారని పేర్కొన్నారు. విమానాలు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నందున వారిని అంత త్వరగా తరలించడం సాధ్యంకాదన్నారు.

జమ్ముకశ్మీర్ లో చిక్కుకున్న మరో 26 మంది

పనాజీ సమీపంలోని ట్రావెల్ బగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని దక్సల్ నాయక్ మాట్లాడుతూ.. తన కంపెనీ నుంచి జమ్ముకశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మందితో కూడిన బృందం అక్కడే చిక్కుకుపోయిందన్నారు. "వారందరూ శ్రీనగర్‌లోని హోటళ్లకు చేరుకున్నారు. వీలైనంత త్వరగా వారిని తిరిగి తీసుకురావడానికి మేం ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్ నుండి వచ్చే విమానాలలో సీట్లు అందుబాటులో లేకపోవడం వల్ల టూర్ ఆపరేటర్లు పర్యాటకులను అక్కడి హోటళ్లలోనే ఉంచాల్సి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా వచ్చే విమానంలో వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.



Next Story

Most Viewed