అయోధ్య రామాలయ సీఈవో పదవి.. 24 గంటల్లో 1,000 దరఖాస్తులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-15 05:40:01  IST  )

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామాలయ CEO పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయోధ్య రామాలయ సీఈవో పదవి.. 24 గంటల్లో 1,000 దరఖాస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామాలయ పరిపాలనా నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 24 గంటల్లోనే ఏకంగా 1,000కి పైగా దరఖాస్తులు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దరఖాస్తుదారుల్లో అత్యధిక శాతం మంది విశ్రాంత బ్యూరోక్రాట్లు, మాజీ సీనియర్ పరిపాలనాధికారులు ఉండగా, మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ రేసులో ఉన్నట్లు స్వయంగా ధృవీకరించారు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 18 చివరి తేదీ కావడంతో, ఈ సంఖ్య మరికొన్ని వేలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల అర్హతల వెరిఫికేషన్ ప్రక్రియలో సహాయం అందించడం కోసం ఒక సెక్రటరీని నియమించాలని ఎంపిక కమిటీ నిర్ణయించింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) విష్ణుకాంత్ చతుర్వేది, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ సురేష్ హవారేలతో కూడిన ఈ ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ జూలై 19న సమావేశమై దరఖాస్తులను సమీక్షించడంతో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియను ఖరారు చేయనుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. పరిపాలనా రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవంతో పాటు అయోధ్యలోనే నివసించేందుకు సిద్ధంగా ఉండాలి. వీటితో పాటు వారు ఖచ్చితంగా హిందూ మతావలంబీకులై ఉండి, శ్రీరామునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండాలని, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలనే నిబంధనలను ట్రస్ట్ విధించింది. ప్రాథమిక స్క్రీనింగ్ అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను నేరుగా లేదా అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నారు. కాగా.. జూలై 22న జరగబోయే ఆలయ ట్రస్ట్ సమావేశంలో ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన ప్రగతి నివేదికను ఎంపిక కమిటీ సమర్పించే అవకాశం ఉంది.

అయోధ్య ట్రస్ట్ సీఈవో రేసులో మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్

Next Story