పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో విపక్షాల ఆందోళన

by Disha Web Desk 12 |
పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో విపక్షాల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సెషన్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు కోరుతూ మంగళవారం విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. దీంతో లోక్ సభ, రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఇవాళ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వేరువేరుగా సమావేశం అయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులో ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

అదానీ వ్యవహారంపై జేపీసీ ఎంక్వయిరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ చౌదరి మాట్లాడుతూ పార్లమెంట్ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతిపక్షాలను మాట్లాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అన్నారు. ఎవరైనా క్షమాపణలు చెప్పాల్సి వస్తే అది ప్రధాని నరేంద్ర మోడీనే అన్నారు. మరో వైపు వాక్ స్వాతంత్ర్యం అంశంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్ సభలో ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చారు.


Next Story