భారతీయులే టార్గెట్‌గా ఆన్‌లైన్‌ మోసాలు.. సింగపూర్ సర్కార్ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |

భారతదేశ పౌరులు, ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న నకిలీ, మోసపూరిత కంటెంట్‌పై సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

భారతీయులే టార్గెట్‌గా ఆన్‌లైన్‌ మోసాలు.. సింగపూర్ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేక్ కంటెంట్‌, ఆన్‌లైన్ స్కామ్‌లను అరికట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశ పౌరులు, సింగపూర్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను (NRIs) లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసపూరిత ఆన్‌లైన్ కంటెంట్, వెబ్‌సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని అక్కడి టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. కాగా, కొద్దిరోజులుగా ఇంటర్నెట్ వేదికగా సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ప్రకటనలు, వీసా ప్రాసెసింగ్ అంటూ మోసపూరిత లింకులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో భారత్‌లో ఉంటున్న యువతను, సింగపూర్ వెళ్లాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ ముఠాలు రూ.లక్షలు దోచుకుంటున్నాయి. దీనిపై సాంకేతిక విశ్లేషణ జరిపిన సింగపూర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) తక్షణ చర్యలకు ఆదేశించింది.

కఠినంగా ‘పోఫ్మా’ చట్ట ప్రయోగం..

ఆన్‌లైన్ తప్పుడు సమాచారం, మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు సింగపూర్ సర్కార్ తాజాగా ‘పోఫ్మా’ (Protection from Online Falsehoods and Manipulation Act) చట్టాన్ని ఉపయోగిస్తోంది. ఈ ఆదేశాల ప్రకారం.. భారతీయులను లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ఏవైనా సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్‌సైట్లు, మాల్‌వేర్ లింకులు కనిపిస్తే వాటిని సింగపూర్ సైబర్ పరిధిలో కనిపించకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. విదేశీ పౌరుల భద్రతకు, అంతర్జాతీయంగా తమ దేశ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకే సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుందని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి.

Next Story