వన్ నేషన్ నో ఎలక్షన్: కోవింద్ కమిటీ నివేదికపై కాంగ్రెస్

by Dishanational2 |
వన్ నేషన్ నో ఎలక్షన్: కోవింద్ కమిటీ నివేదికపై కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు నివేదికను అందజేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన నాసిక్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ లక్ష్యం స్పష్టంగా ఉంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడమే వారి పని’ అని తెలిపారు. ఒకే దేశం ఉండాలి..కానీ అందులో ఎన్నికలే ఉండకూడదని భావిస్తున్నారన్నారు. ఇప్పటికే దేశంలోని రాజ్యాంగ సంస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కాగా, కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికలు అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని, ప్రజాస్వామ్య పునాదులను మరింతగా పెంచుతాయని తెలిపింది. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజకీయ సమస్య కాదని, డబ్బు, ఇతర వనరులను ఆదా చేయడమే దాని లక్ష్యమని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లి తెలిపారు.

32 పార్టీల మద్దతు!

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కోవింద్ కమిటీ 62 పార్టీలను సంప్రదించగా.. 15 పార్టీలు మాత్రమే ఈ విధానాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.జాతీయ పార్టీల్లో, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), సీపీఎంలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా..ప్రాంతీయ పార్టీల్లో ఏఐయూడీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సీపీఐ, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్ వాదీ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. మరో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపాయని. అంతేగాక పలు సూచనలు సైతం చేశాయని నివేదిక పేర్కొంది.

Next Story

Most Viewed