35 పైసలకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్

by Dishafeatures2 |
35 పైసలకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్
X

న్యూఢిల్లీ : ట్రైన్ టికెట్ తో పాటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోచ్చని మీకు తెలుసా ? అది కూడా ఒక్క రూపాయి కన్నా తక్కువ ప్రీమియం రుసుముతోనే !! ఒడిశా ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే బీమా గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వారికే కల్పిస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది నష్టపోతున్నారు. ప్రమాదానికి గురైనా ఈ బీమా విషయం తెలియక పరిహారాన్ని పొందలేకపోతున్నారు. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు.. వెబ్ సైట్ లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఒక పాప్ అప్ వస్తుంది. అది ఓపెన్ చేసి ఇన్సూరెన్స్ కోసం 35 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించిన వెంటనే మీ ఫోన్ నంబరు, ఈ-మెయిల్ కు ఒక లింక్ వస్తుంది. అది ఇన్సూరెన్స్ కంపెనీ లింక్. దాన్ని ఓపెన్ చేసి .. నామినీ వివరాలు పొందుపరచాలి.

నామినీ వివరాలు అందించకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రయాణికులు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10,000 కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. రైలు ప్రమాదం జరిగి మృతిచెందినా లేదా శాశ్వతంగా అంగ వైకల్యం ఏర్పడినా.. పని చేయలేని పరిస్థితిలో బాధితులు ఉన్నప్పుడు రూ.10 లక్షల వరకు బీమా పరిహారం అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు ఇస్తారు. రైలు ప్రమాదంలో క్షతగాత్రులు అయిన వారికి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.2 లక్షలు అందిస్తారు.

క్లెయిమ్ చేసుకోవడం ఇలా..

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు ముందుగా నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. అక్కడ అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్న తర్వాత నాలుగు నెలల్లోగా బాధితులకు బీమా సొమ్మును అందిస్తారు. ఈ విషయం తెలియక కొందరు.. తెలిసినా మరికొందరు పట్టించుకోకుండా వదిలేస్తారు. 35 పైసలలోపు ఉన్న ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను చెల్లించి బీమా సదుపాయం పొందొచ్చు.



Next Story