Odisha: ఎమర్జెన్సీ టైంలో జైలుకెళ్లిన వారికి రూ. 20 వేల పెన్షన్.. ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం

by B.Srinivas |

ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తమ రాష్ట్ర ప్రజలకు ప్రతి నెలా రూ.20,000 పెన్షన్ అందిస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.

Odisha: ఎమర్జెన్సీ టైంలో జైలుకెళ్లిన వారికి రూ. 20 వేల పెన్షన్.. ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎమర్జెన్సీ (Emergency) సమయంలో జైలుకు వెళ్లిన తమ రాష్ట్ర ప్రజలకు ప్రతి నెలా రూ.20,000 పెన్షన్, ఇతర ప్రయోజనాలను అందిస్తామని ఒడిశా (Odisha) ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఎమర్జెన్సీ టైంలో చిత్ర హింసలకు గురైన ఒడిశా ప్రజలకు పెన్షన్ అందజేయడంతో పాటు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది’ అని తెలిపింది. జైల్లో నిర్బంధించిన కాలంతో సంబంధం లేకుండా 2025 జనవరి 1నాటికి జీవించి ఉన్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ తేదీ నుంచి మాత్రమే ప్రయోజనాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్, డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఎమర్జెన్సీ సమయంలో అరెస్టై జైలు పాలైన వారికి నెలవారీ పెన్షన్‌ను అందజేస్తామని ఈ నెల 2న సీఎం మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, 1975 జూన్ 25 నుంచి 1975 మార్చి 21 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అయితే దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అనేక మందిని జైళ్లలో నిర్భందించారు.

Next Story