గొంతు తగ్గించుకోకుంటే బయటికి సాగనంపుతా.. లాయర్‌కు సీజేఐ వార్నింగ్

by Dishanational4 |
గొంతు తగ్గించుకోకుంటే బయటికి సాగనంపుతా.. లాయర్‌కు సీజేఐ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా అరుదు. తాజాగా బుధవారం అలాంటి ఓ ఘటన సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది. ఒక పిటిషన్ లిస్టింగ్ విషయంపై ఒక న్యాయవాది బిగ్గరగా మాట్లాడుతూ వాదనలను వినిపించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఒక సెకండ్.. గొంతు తగ్గించుకోండి. భారత సర్వోన్నత న్యాయస్థానం ఎదుట మీరు వాదనలు వినిపిస్తున్నారు. స్వరం తగ్గించండి. లేదంటే కోర్టు నుంచి మిమ్మల్ని సాగనంపాల్సి ఉంటుంది’’ అని చంద్రచూడ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ గొంతు పెంచి కోర్టు మీద కోప్పడొచ్చని అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. గత 23 ఏళ్లలో ఈ విధంగా ఎన్నడూ జరగలేదు. నా కెరియర్‌లో చివరి ఏడాది కూడా అలా జరగబోదు’’ అని సీజేఐ స్పష్టం చేశారు.

సీజేఐకు న్యాయవాది క్షమాపణలు

‘‘మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా మామూలుగా ఉంటారా ? లేదా ? ప్రతిసారీ జడ్జీల మీద ఇలాగే అరిచి గగ్గోలు పెడుతుంటారా ?’’ అని న్యాయవాదిని చంద్రచూడ్ ప్రశ్నించారు. కోర్టు రూమ్‌లో హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సీజేఐ తీవ్రంగా హెచ్చరించడంతో న్యాయవాది వెంటనే క్షమాపణలు చెప్పారు. కోర్టు పద్ధతుల ప్రకారం తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను సమర్పించారు. గతేడాది మార్చిలో కూడా ఇలాంటి ఘటనే సుప్రీంకోర్టులో జరిగింది. సీనియర్ అడ్వకేట్ విక్రమ్ సింగ్‌పై సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదులకు సంబంధించిన ల్యాండ్ కేసును ముందుకు కదల్చాలంటూ న్యాయవాది వాగ్వాదానికి దిగడంపై చంద్రచూడ్ మండిపడ్డారు. కోర్టు రూమ్ నుంచి తక్షణమే బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు.


Next Story

Most Viewed