Hindi Row: విద్యను రాజకీయం చేయొద్దు.. స్టాలిన్ కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్

by Shamantha N |

జాతీయ విద్యా విధానం అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కీలక వ్యాఖ్యలు చేశారు.

Hindi Row: విద్యను రాజకీయం చేయొద్దు.. స్టాలిన్ కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా విధానం అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందన్నారు. జాతీయ విద్యావిధానం (National Education Policy) ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం జరుగుతోందన్నరు. తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు మోడీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దని కోరారు. కాగా.. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి వెంటనే రూ.2,152 నిధులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి (PM Modi) ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ ప్రధాని ఈ కామెంట్లు చేశారు.

స్టాలిన్ ఏమన్నారంటే?

అయితే, జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్రశిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయబోమని విద్యాశాఖ మంత్రి గతంలోనే వెల్లడించారు. ప్రధానికి స్టాలిన్ రాసిన లేఖలో ఈ విషయం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలకు ఆగ్రహం తెప్పించిందన్నారు. నిధులు విడుదల చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు విఫలం అవుతాయన్నారు. 2024-25వ ఏడాదికి రాష్ట్రానికి అందాల్సిన రూ.2,152 కోట్లను వెంటనే మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Next Story