పోలీస్ స్టేషన్లకు వెళ్లి లొంగిపోండి.. మే 4 తర్వాత ఎవరినీ వదిలేది లేదు.. ప్రధాని మోడీ వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-04-19 13:14:08  IST  )

టీఎంసీ సిండికేట్‌పై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్లకు వెళ్లి లొంగిపోండి.. మే 4 తర్వాత ఎవరినీ వదిలేది లేదు.. ప్రధాని మోడీ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పశ్చిమ బెంగాల్‍లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయన.. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వారంతా ఈ నెల 29 లోగా పోలీస్ స్టేషన్‍లో లొంగిపోవాలని హెచ్చరించారు. పురూలియాలో మాట్లాడిన ప్రధాని… రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆదివాసీల భూములను సిండికేట్లు ఆక్రమించుకున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ 'కట్-మనీ' (కమీషన్) తీసుకుంటోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధి కొరత, పరిశ్రమల కొరతకు టీఎంసీనే కారణం అని ధ్వజమెత్తారు.

కూకటివేళ్లతో పెకిలిస్తా:

పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు టీఎంసీ సిండికేట్ గుప్పిట్లో ఉన్నాయని ప్రధాని అన్నారు. వ్యవసాయ మండీలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల నియంత్రణను అధికార పార్టీ తమ 'సిండికేట్' సభ్యులకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని ఆయన శపథం చేశారు. ఇక్కడ విజయ సంకల్ప సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మమతా ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను దోచుకుందని, వేలాది మంది యువతను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని టీఎంసీ మహా జంగల్ రాజ్ కారణంగా ఇది ఒక పెద్ద సంక్షోభం అన్నారు.

గెలుపు మాదే:

నేను సాధారణంగా ఎన్నికల గురించి అంచనాలు వేయనని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పను. కానీ ఈసారి, నేను కలిసిన ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం ఖాయమని చెబుతున్నారన్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వ పాలనలో బెంగాల్‌లో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు.

దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం! వీడియో సందేశం ద్వారా స్పష్టత ఇచ్చిన ప్రధాని మోడీ

Next Story