ఏది జరిగినా ప్రజలు నా వైపే వేలు చూపిస్తున్నారు.. పార్టీ నేతలకు శిందే వార్నింగ్‌

by Yella Dhawani Reddy |

ఆహారం సరిగా లేదని ముంబైలోని ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ సిబ్బందితో శివసేన వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ (MLA Sanjay Gaikwad) ఘర్షణకు దిగిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఏది జరిగినా ప్రజలు నా వైపే వేలు చూపిస్తున్నారు.. పార్టీ నేతలకు శిందే వార్నింగ్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఆహారం సరిగా లేదని ముంబైలోని ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ సిబ్బందితో శివసేన వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ (MLA Sanjay Gaikwad) ఘర్షణకు దిగిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) స్పందిస్తూ.. కార్యకర్తలను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, విజయాన్ని తలకెక్కించుకోవద్దని సూచించారు. దాదర్‌లో జరిగిన ఓ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి శిందే మాట్లాడుతూ.. ‘ఇటీవల కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏది జరిగినా ప్రజలు మీపై కాకుండా నా వైపే వేలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన గురించి ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలంతా నా కుటుంబంతో సమానం. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లొద్దు. తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయండి. క్రమశిక్షణను పాటించకపోతే బాధ్యత వహించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రజా జీవితం క్రమశిక్షణ కోరుతుంది, దాన్ని పాటించాలి," అని తెలిపారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముంబైలోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథిగృహంలో బుల్దానా ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ బస చేశారు. ఈ క్రమంలో ఆయన ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా, తనకు ఇచ్చిన పప్పు దుర్వాసన వస్తోందని ఆరోపించారు. వెంటనే క్యాంటీన్‌ వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో వాదనకు దిగారు. వేలాది మంది ఆరోగ్యంతో క్యాంటీన్‌ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా క్యాంటీన్‌ నిర్వాహకుడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందిస్తూ.. ఎమ్మెల్యే చర్య ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.

Next Story