జంపింగ్స్‌లో నితీశ్ చరిత్ర సృష్టిస్తారేమో.. లాలూ పార్టీ సెటైర్స్

by Dishanational4 |
జంపింగ్స్‌లో నితీశ్ చరిత్ర సృష్టిస్తారేమో.. లాలూ పార్టీ సెటైర్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్డీఏ గూటిలో చేరేందుకు రెడీ అవుతున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ ప్రశ్నాస్త్రాలు సంధించింది. రాష్ట్రంలోని మహా కూటమిలో ఉంటారో ఉండరో తమకు స్పష్టత ఇవ్వాలని కోరింది. ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా ప్రశ్నలకు నితీశ్ కుమార్ సమాధానం చెప్పడం లేదు. ఆయన మళ్లీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరతారని వినవస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌లను పక్కనపెట్టి బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి’’ అని తెలిపారు. ‘‘మేం గురువారం రోజు నితీశ్ అపాయింట్‌మెంట్ అడిగాం.. కానీ ఇప్పటి వరకు ఆయన మాకు టైం ఇవ్వలేదు.. గతంలో చేసిన తప్పునే నితీష్ జీ మళ్లీ చేయరని మేం అనుకున్నాం.. కానీ నితీశ్ ఎటువైపు ఉన్నారో ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తోంది. ఆయన ఎన్నిసార్లని ఎన్డీఏలోకి వెళ్తారు? చరిత్ర సృష్టించాలని నితీశ్‌జీ అనుకుంటున్నారేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed