ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్‌హెచ్ఏఐ

by Dishanational1 |
ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్‌హెచ్ఏఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్‌లకు సంబంధించి ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు జనవరి ఆఖరుగా ఉన్న గడువును నెలరోజులు పెంచి ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రక్రియకు అవకాశం కల్పించింది. ఒకే వాహనం ఉన్నవారు ఎక్కువ ఫాస్టాగ్‌లను కలిగి ఉండకుండా ఎన్‌హెచ్ఏఐ 'ఒక వాహనం-ఒక ఫాస్టాగ్ ' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతోంది. గడువు ముగిసిన తర్వాత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వ్యాలెట్లు డీయాక్టివేట్ అవుతాయని, వీలైనంత త్వరగా ఫాస్టాగ్ అధికారిక వెబ్‌సైట్, లేదా నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్‌సైట్ నుంచి కేవైసీ పూర్తి చేయాలని ఎన్‌హెచ్ఏఐ సూచించింది. ఈ-కేవైసీ ప్రక్రియ కోసం ఫాస్టాగ్ వెబ్‌సైట్‌లో లాగ్-ఇన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డులో 'మై ప్రొఫైల్ 'లో సరైన వివరాలను అందించి ప్రక్రియను పూర్తిచేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే చేసి ఉంటే, వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, ఓటీపీని నమోదు చేసి లాగ్-ఇన్ అయిన తర్వాత 'మై ప్రొఫైల్ 'లోనే కేవైసీ స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకుని సరిచూసుకోవచ్చు.



Next Story

Most Viewed