కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు?.. కింగ్ చార్లెస్ అమెరికా పర్యటన వేళ తెరపైకి ఇష్యూ

by Prasad Jukanti |   (  Updated:2026-04-30 02:48:39  IST  )

చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు అప్పగించాలని కింగ్ చార్లెస్‌ను కోరతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు?.. కింగ్ చార్లెస్ అమెరికా పర్యటన వేళ తెరపైకి ఇష్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటర్ మహారాణి కిరిటంలో పొదిగి ఉన్న కోహినూర్ వజ్రం తిరిగి భారత్ కు అప్పగించే అంశంపై చాలాకాలం చర్చ జరుగుతోంది. ఈ వజ్రాన్ని భారత్‌కు వాపసు చేయాలంటూ లండన్‌లో నిరసన ప్రదర్శనలు సైతం జరిగాయి. అయితే ప్రస్తుతం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికా పర్యటనలోఉన్న వేళ ఈ అంశం మరోసారి తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని తాను బ్రిటన్ రాజును కోరతానని భారతీయ మూలాలు కలిగిన న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేట్ సమావేశంలో ప్రస్తావిస్తా:

సెప్టెంబర్ 11 దాడుల బాధితుల సంస్మరణ కార్యక్రమానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మమ్దానీ మాట్లాడారు. ఈ అంశం అధికారిక ఎజెండాలో లేనప్పటికీ, కింగ్ చార్లెస్‌తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు చేరాలని తాను ప్రోత్సహిస్తానని ఆయన పేర్కొన్నారు. వలస పాలనలో వజ్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారని, అది తమ దేశ చరిత్రలో ఒక విలువైన భాగమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. తమ దేశ సంపదను తిరిగి ఇచ్చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. అయితే, 19వ శతాబ్దపు ఒప్పందం ప్రకారం ఆ వజ్రం చట్టబద్ధంగా తమదేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజంగానే జోహ్రాన్ మమ్దానీ ఈ వజ్రం విషయాన్ని కింగ్ చార్లెస్‍తో ప్రస్తావిస్తే ఆయన మాటను ఏ మేరకు మన్నిస్తారో చూడాలి.

కోహినూర్ చరిత్ర - వివాదం:

105.6 క్యారెట్ల బరువున్న ఈ అమూల్యమైన ఈ కోహినూరు వజ్రం13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో ఇప్పుడు తెలంగాణలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న కొల్లూరు గనులలో మొదట బయటపడింది. ఆ తర్వాత ఎందరో రాజులు, రాజ్యాల చేతులు మారడంతో పాటు ఈ వజ్రం ఎన్నో భీకర యుద్ధాలకు దారితీసింది. దీన్ని పొందేందుకు హింస, విద్రోహం, చిత్రహింసలు, హత్యలు వంటివి శతాబ్దాల తరబడి సాగాయి. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్ల చేతులు మారుతూ వచ్చి చివరకు 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి చిన్నారి మహారాజా దులీప్ సింగ్‌ను బలవంతం చేసి ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాణి కిరీటంలో పొదగబడి, లండన్ టవర్‌లో ప్రదర్శనలో ఉంది.

Next Story