మోడీ చేసిన నేరాన్ని దేశం ఎప్పటికీ క్షమించదు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

by Dishanational2 |
మోడీ చేసిన నేరాన్ని దేశం ఎప్పటికీ క్షమించదు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్లకు సంబంధించిన రూ.16లక్షల కోట్ల రూపాయలను ప్రధాని మోడీ మాఫీ చేశారని, మోడీ చేసిన ఈ నేరాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోడీ తన స్నేహితులైన బిలియనీర్ల రూ.16లక్షల కోట్లు మాఫీ చేశారు. ఈ డబ్బు భారతీయుల బాధలను పోగొట్టడానికి ఎంతో ఉపయోగపడేది. కానీ అదానీ వంటి వారిని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడింది’ అని పేర్కొన్నారు. ‘మోడీ మాఫీ చేసిన రుణాలతో 16కోట్ల మంది యువకులకు ఏటా రూ.లక్ష రూపాయల ఉద్యోగం లభించేది. 16కోట్ల మంది మహిళలకు ఏటా రూ.లక్ష రూపాయల సాయం అందేది. అలాగే 10కోట్ల మంది రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉండేది. దీని ద్వారా వారి జీవితాలను మార్చగలిగేవారు’ అని వెల్లడించారు.

అంతేగాక 20 ఏళ్లపాటు కేవలం రూ. 400కే గ్యాస్ సిలిండర్లు దేశమంతటికీ అందజేసేవారని తెలిపారు. భారత సైన్యం ఖర్చులు కూడా మూడేళ్ల పాటు భరించే వీలుండేదని, దళిత, గిరిజన, యువకులకు గ్రాడ్యుయేషన్‌ వరకు విద్య ఉచితంగా అందజేయొచ్చని స్పష్టం చేశారు. ఇవన్నీ విడిచిపెట్టి మోడీ ధనవంతుల రుణాలను మాఫీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి భారతీయుడి పురోగతి మారుతుందని తెలిపారు.



Next Story

Most Viewed