3 పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా: కునో నేషనల్ పార్కులో సందడి

by Dishanational2 |
3 పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా: కునో నేషనల్ పార్కులో సందడి
X

దిశ, నేషనల్ బ్యూరో: నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన ‘జ్వాలా’ అనే చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన చీతా కూనలు సందడి చేసే వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘నమీబియాకు చెందిన ‘జ్వాలా’ అనే చిరుత మూడు పిల్లకు జన్మనిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న వన్య ప్రాణుల ప్రేమికులకు అభినందనలు’ అని పేర్కొన్నారు. జనవరి 3న నమీబియాకు చెందిన ‘ఆశా’ అనే చీతా సైతం 3 పిల్లలకు జన్మనిచ్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది మార్చిలో సీయయ్య అనే చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వగా..అందులో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది.

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా భారత్‌కు

దేశంలో అంతరించిపోయిన జాతులను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘ప్రాజెక్ట్ చీతా’ కింద రెండు విడతల్లో భారత్‌కు చీతాలను తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న మొదటి విడతగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను ప్రధాని మోడీ తన జన్మదినం సందర్భంగా కునో నేషనల్ పార్కులో రిలీజ్ చేశారు. అనంతరం ఫిబ్రవరి 2023లో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకొచ్చారు. అయితే ఈ 20 చీతాల్లో 8 చిరుతలు మృతి చెందాయి. ఈ చీతాలను ప్రభుత్వ అధికారులు, వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు, పశువైద్యులతో కూడిన నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.

Next Story