Nag mk2: ‘నాగ్ ఎంకే-2’ ట్రయల్స్ సక్సెస్.. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి

by B.Srinivas |

దేశీయంగా అభివృద్ధి చేసిన మూడో తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘నాగ్ ఎంకే-2’ ట్రయల్స్‌ను విజయవంతంగా పరీక్షించారు.

Nag mk2: ‘నాగ్ ఎంకే-2’ ట్రయల్స్ సక్సెస్.. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన మూడో తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘నాగ్ ఎంకే-2’ ట్రయల్స్‌ను విజయవంతంగా పరీక్షించారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్ రేంజ్‌లో సీనియర్ ఆర్మీ అధికారుల సమక్షంలో ఇటీవల ఈ పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మొత్తం మూడు ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించగా ఈ సమయంలో క్షిపణి వ్యవస్థలు గరిష్ట, కనిష్ట పరిధిలోని అన్ని లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. అంతేగాక క్షిపణి అసాధారణమైన ఖచ్చితత్వం, విశ్వసనీయతను ప్రదర్శించిందని వెల్లడించింది. దీంతో మొత్తం ఆయుధ వ్యవస్థ త్వరలోనే భారత సైన్యంలోకి చేరనుంది. ట్రయల్స్ సక్సెస్ కావడం పట్ల కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీఓకు అభినందనలు తెలిపారు. కాగా, నాగ్ ఎంకే-2 అనేది మూడో తరం యాంటీ ట్యాంక్ ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెడ్ క్షిపణి. కాల్పులు జరిపిన తర్వాత దానికి తదుపరి నియంత్రణ అవసరం లేదు. లక్ష్య ఖచ్చితత్వం, ఆధునిక సాంకేతికత కారణంగా ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతపైనే ఆధారపడి ఉంటుంది.

Next Story