స్వదేశానికి మయన్మార్ సైనికులు: 184 మందిని తిప్పిపంపిన అధికారులు

by Dishanational2 |
స్వదేశానికి మయన్మార్ సైనికులు: 184 మందిని తిప్పిపంపిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌లో కొన్ని రోజులుగా ఆ దేశ సైన్యం, సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారు. ఇప్పటి వరకు 276 మంది సైనికులు సరిహద్దు రాష్ట్రమైన మిజోరంలోకి వచ్చారు. అయితే వారిలో 184 మందిని స్వదేశానికి తిప్పి పంపినట్టు అధికారులు తెలిపారు. మయన్మార్ ఎయిర్ ఫోర్సుకు చెందిన విమానంలో వారిని రెండు విధాలుగా పంపించినట్టు వెల్లడించారు. సైనికులు బయలుదేరే ముందు వారికి అవసరమైన అన్ని లాంఛనాలను అధికారులు పూర్తి చేశారు. మిగిలిన 92 మందిని కూడా మంగళవారం తరలించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ జవాన్లను వెనక్కకి పంపేలా చూడాలని మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైనికులను పంపిచడం గమనార్హం.

జనవరి 17న భారత్‌కు రాక

మయన్మార్‌లోని రఖైన్ ప్రావీన్సులో సాయుధ మిలిటెంట్లు ఆర్మీ శిబిరాలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న తర్వాత 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోని లాంగ్ట్లై జిల్లాకు వచ్చి అక్కడే ఆశ్రయం పొందారు. దీంతో అప్రమత్తమైన మిజోరం సీఎం లాల్దూహోమా జనవరి 20 న షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ఈ సమస్యను ప్రస్తావించారు. మయన్మార్ సైనికులను వెనక్కి పంపించాలని కోరారు. దీంతో అమిత్ షా చర్యలు చేపట్టారు. మొత్తంగా గతేడాది నవంబర్ 13 నుంచి ఇప్పటి వరకు 636 మంది మయన్మార్ సైనికులు భారత్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు జనవరి 2, 9 తేదీల్లో 151 మంది మయన్మార్ మిలిటరీ విమానంలో స్వదేశానికి వెళ్లారు.

ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ అగ్రిమెంట్‌పై పునరాలోచన!

మయన్మార్ సైన్యం, ప్రజాస్వామ్య అనుకూల మిలీషియా మధ్య భీకర పోరు కారణంగా మయన్మార్ ప్రజలు సరిహద్దులు దాటనున్నారనే ఆందోళనతో భారత్- మయన్మార్ సరిహద్దు పొడవునా కంచె ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతం ఇరుదేశాలు ఫెన్సింగ్ లేకుండా 1,643 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి.అంతేగాక మయన్మార్‌తో ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (ఎఫ్‌ఎంఆర్) ఒప్పందం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పునరాలోచిస్తోందని అమిత్ షా వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 2021 నుంచి మయన్మార్‌లో సైన్యం, సాయుధ గ్రూపుల మధ్య పోరు నడుస్తోంది.



Next Story

Most Viewed