Myanmar: ఆన్‌లైన్ స్కామ్‌లపై మయన్మార్ కఠిన చట్టం

by S Gopi |

బాధితులను బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేసే నిందితులకు తీవ్రమైన మరణశిక్ష విధించేలా మయన్మార్ పార్లమెంట్ నూతన 'యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు'ను ఏకగ్రీవంగా ఆమోదించింది.

Myanmar: ఆన్‌లైన్ స్కామ్‌లపై మయన్మార్ కఠిన చట్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ నేరగాళ్ల పట్ల కఠిన వైఖరి అనుసరిస్తూ మయన్మార్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లను నడుపుతూ బాధితులను బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేసే నిందితులకు తీవ్రమైన మరణశిక్ష విధించేలా మయన్మార్ పార్లమెంట్ నూతన 'యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు'ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మయన్మార్ కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ తొలి చట్టం ప్రకారం.. వ్యక్తులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి సైబర్ మోసాలు చేయిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఈ బలవంతపు చర్యల వల్ల బాధితులు మరణిస్తే నేరస్తులకు తప్పనిసరిగా ఉరిశిక్ష పడేలా చట్టంలో నిబంధనలు చేర్చడం గమనార్హం.

బలవంతంగా ఆన్‌లైన్ మోసాలు, హనీట్రాప్‌లు

మయన్మార్‌లో అంతర్యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నడుమ క్రిప్టోకరెన్సీ మోసాలు, హనీట్రాప్ స్కామ్ నెట్‌వర్క్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగాల పేరుతో విదేశీయులను అక్రమ రవాణా ద్వారా ఇక్కడికి రప్పించి, వారి చేత బలవంతంగా ఆన్‌లైన్ మోసాలు, హనీట్రాప్‌లు, క్రిప్టో స్కామ్‌లు చేయిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఎవరైనా నిరాకరిస్తే చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చాలామంది బాధితులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మయన్మార్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ సెంటర్లను నడిపేవారికి, క్రిప్టో మోసాలకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించడమే కాకుండా, విదేశీ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ కఠిన నిబంధనలను తీసుకువచ్చినట్లు మయన్మార్ ఎంపీలు స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి ఆందోళన

ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, ఇది కేవలం ఒక దేశానికే పరిమితమైన సమస్య కాదని, ఆగ్నేయాసియా అంతటా విస్తరించిన వ్యవస్థీకృత నేర సమూహమని స్పష్టం చేస్తోంది. ఫిలిప్పీన్స్, కంబోడియా, లావోస్, మయన్మార్‌లలో కోవిడ్ తర్వాతి కాలంలో దాదాపు వందలాది రహస్య 'స్కామ్ ఫార్మ్స్' వెలిశాయి. ఈ సైబర్ నేరాల నెట్‌వర్క్‌లను తుదిముట్టించాలంటే ప్రాంతీయ దేశాల చట్ట అమలులో సంస్థల మధ్య సకాలంలో సమాచార మార్పిడి, డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఉమ్మడి సహకారం చాలా కీలకమని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది.

Next Story