‘ముస్లిం లీగ్’ పూర్తిగా సెక్యులర్ పార్టీ.. రాహుల్ గాంధీ

by Disha Web Desk 13 |
‘ముస్లిం లీగ్’ పూర్తిగా సెక్యులర్ పార్టీ.. రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: కేరళకు చెందిన ముస్లింలీగ్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కేరళలో తనకు చిరకాల మిత్రపక్షమైన ముస్లింలీగ్ ‘పూర్తిగా సెక్యులర్’ పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ‘భారత దేశంలో ప్రతిపక్షాల ఐక్యత.. మత స్వేచ్ఛ.. మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు.. దేశం పరిస్థితి’ అనే అంశాలపై శుక్రవారం వాషింగ్టన్ లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో చర్చాగోష్టి నిర్వహించారు.

బీజేపీ హిందుత్వ రాజకీయాల కారణంగా మోడీ పాలనలో భారత్ లో లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందని రాహుల్ విమర్శించారు. దీంతో ‘కేరళలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్ తో పొత్తు పెట్టుకుంది కదా..’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘ముస్లింలీగ్ పూర్తిగా సెక్యులర్ పార్టీ. ముస్లింలీగ్ లో సెక్యులర్ లేనిదేదీ లేదు’ అని రాహుల్ స్పష్టం చేశారు.

జిన్నా పార్టీ సెక్యులరా..?: బీజేపీ

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించిన బీజేపీ.. దేశ విభజనకు కారణమైన జిన్నా నెలకొల్పిన ‘ముస్లింలీగ్’ను సెక్యులర్ పార్టీగా అభివర్ణించడం దేశానికే అవమానకరమని పేర్కొన్నది. రాహుల్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బీజేపీ వైరల్ చేసింది. రాహుల్ దేశ చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. రాహుల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లో ముస్లింల ఓట్ల కోసం ఇంతకు దిగజారుతారా..? అని ప్రశ్నించారు.

జిన్నా పార్టీ.. కేరళ ముస్లింలీగ్ భిన్నమైనవి: కాంగ్రెస్

దేశ చరిత్ర బీజేపీకే సరిగ్గా తెలియదని, మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్, కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు పూర్తిగా భిన్నమైనవని, ఆ రెండింటికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ‘ఈ తేడా కూడా తెలియని మీరు నిరక్షరాస్యులా’ అని బీజేపీ నేతలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

శాసనోల్లంఘన ఉద్యమాల నుంచి బయట పడేందుకు జిన్నాకు చెందిన ముస్లింలీగ్ తో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ ఎస్ కలిసి పని చేసిందని, దేశ విభజనకు, రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్, ముస్లింలీగ్ పోటీ పడ్డాయని గుర్తు చేశారు. 2012లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పై అధికారాన్ని నిలుపుకునేందుకు ఇద్దరు ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) కార్పొరేటర్ల మద్దతును బీజేపీ తీసుకున్న విషయాన్ని మర్చిపోయిందా..? అని ఎద్దేవా చేశారు. బీజేపీలో ‘ఫేక్ న్యూస్’ను వ్యాప్తి చేసే వాళ్లు ఎక్కువయ్యారని, వాళ్లతో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ప్రజలను హెచ్చరించారు.

Also Read..

రాహుల్ అనర్హతతో నేతల్లో మార్పువచ్చేనా?


Next Story

Most Viewed