Mumbai: ముంబై జలమయం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by B.Srinivas |

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Mumbai: ముంబై జలమయం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగుతోంది, లోక్ ట్రైన్స్ నిలిచిపోగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు విమాన ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 304 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పది విమానాలు రద్దు కాగా, 198 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ పరిస్థితిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra fadnavis) స్పందించారు. రాబోయే 48 గంటలు ఎంతో కీలకమని తెలిపారు. సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు. మిథి నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయిని మించిపోవడంతో దాదాపు 400-500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

నాందేడ్‌లో 8 మంది మృతి

భారీ వర్షాల కారణంగా నాందేడ్ జిల్లాలో పలు ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత రెండు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 14కు చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 12 నుంచి 14 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ఫడ్నవీస్ తెలిపారు.

Next Story