మాన్సూన్ ఉగ్రరూపం.. భారీ వర్షాలకు 200 మందికి పైగా మృతి

by Naga Rani Yarlagadda |

పాకిస్థాన్‌లో రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

మాన్సూన్ ఉగ్రరూపం.. భారీ వర్షాలకు 200 మందికి పైగా మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో గణనీయమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం.. ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 202 మంది మరణించారు. వీరిలో దాదాపు సగం మంది పిల్లలు ఉన్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మృతుల్లో 96 మంది పిల్లలు ఉన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 123 మరణాలు నమోదయ్యాయి.

ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్‌లో 21, బలూచిస్థాన్‌లో 16, ఇస్లామాబాద్, ఆజాద్ జమ్మూ కశ్మీర్‌లో ఒక్కొక్కరు మరణించారని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ జియో న్యూస్ తెలిపింది. మరణాల్లో 118 మంది ఇళ్ల కూలిపోవడం వల్ల, 30 మంది ఆకస్మిక వరదల్లో చనిపోగా, మిగిలిన వారు పిడుగుపాటు, విద్యుత్ షాక్, కొండచరియల విరిగిపడటం వంటి కారణాలతో మరణించారు. కుండపోత వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం (NEOC) దేశవ్యాప్తంగా ప్రభావ ఆధారిత వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్‌లలో వరద ప్రభావిత జిల్లాలను హై అలర్ట్‌పై ఉంచారు.

Next Story